ఆయన మరణం సినీ పరిశ్రమతో పాటు అభిమానులను దిగ్భ్రాంతికి గురి చేసింది. ఇండస్ట్రీలో కమెడియన్ గా గుర్తింపు తెచ్చుకున్న ఆయన.. జనవరిలో యాంజియో చికిత్స చేయించుకున్నారు. అప్పటి నుంచి పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన బుధవారం మరణించారు.
ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది. తమిళ్ డైరెక్టర్.. కమెడియన్ మనోబాల కన్నుమాశారు. 9 ఏళ్ల మనోబాల కొంతకాలంగా కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతూ , రెండు వారాలుగా చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. మనోబాల మృతి తమిళ సినీ పరిశ్రమను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. తమిళ సినీ పరిశ్రమలో నటుడు, దర్శకుడు, నిర్మాతగా రాణించిన మనోబాల తెలుగు ప్రేక్షకులకూ కూడా సుపరిచితం. మనోబాల తమిళ సినిమాలు తెలుగులో డబ్ అయిన తరువాత సూపర్ హిట్టయ్యాయి.
తెలుగులో ఆయన మహానటి, దేవదాసు, రాజ్దూత్, వాల్తేరు వీరయ్య వంటి చిత్రాల్లో ఆయన నటించారు. చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య చిత్రంలో న్యాయమూర్తిగా కనిపించారు.
1970ల్లో సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన మనోబాల.. 1979లో భారతీరాజా వద్ద సహాయ దర్శకుడిగా మారారు. ఆ తర్వాత దర్శకుడిగానూ 20కి పైగా చిత్రాలను తెరకెక్కించారు. మూడు చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించారు. దాదాపు 350 సినిమాల్లో సహాయ నటుడిగా మెప్పించారు. దిగ్గజ నటులు కమల్ హాసన్, రజనీకాంత్ చిత్రాల్లో హాస్యనటుడిగా ప్రేక్షకులను అలరించారు. పలు సీరియళ్లలోనూ నటించి బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరయ్యారు.